- అపల్లికేషన్ ఫీజులు భారీగా పెంపు..
- వెయ్యికి 400 శాతం పెంపు..
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ అప్లికేషన్ ఫీజును తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) భారీగా పెంచింది. ఇప్పటి వరకు రూ. 200గా ఉన్న ఫీజును ఏకంగా వెయ్యికి పెంచింది. ఒకేసారి 400% ఫీజులను వడ్డించింది.తెలంగాణ కొత్తగా ఐదు నోటిఫికేషన్లు విడుదల చేయగా, ఐదింటికి రూ. వెయ్యి ఫీజు విధించింది. బీసీ విద్యార్థులకు రాయితీ ఇవ్వలేదు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. వెయ్యి చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500 ఫీజుగా తీసుకుంటున్నది.
భారీగా ఫీజులు పెంచడంపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. నమ్మి ఓట్లేస్తే తమను నట్టేటముంచారని ఫైర్ అవుతున్నది. ప్రజాపాలన అంటే ఇదేనా? అని నిలదీస్తున్నది. ఉద్యోగాల భర్తీయేమో గానీ.. మా జేబులకు చిల్లులుపెడతారా? అంటూ మండిపడుతున్నది. పెంచిన ఫీజులను రూ. 200కు తగ్గించాలని, లేదా నిరుద్యోగులందరికీ ఉచితంగా దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నది. ఒకే తరహా పోస్టులు, ఒకే అర్హత గల పోస్టులకు కంబైన్డ్ నోటిఫికేషన్లు జారీచేయాలని కోరుతున్నది.
