- ధాన్యం తరలింపుపై రైతుల ఆందోళన
మండలంలోని మిన్పూర్లో ధాన్యం తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీంతో మెదక్–బొడ్మట్పల్లి రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయినా తరలింపు లేకపోవడం, తూకాలు ఆలస్యం కావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు.
మిల్లుల వద్ద లారీలు రోజుల తరబడి నిలిచిపోవడంతో వాహనాల కొరత ఏర్పడిందని నిర్వాహకులు తెలిపినా రైతులు ఆందోళన కొనసాగించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ లారీలు సమకూరుస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించగా, పోలీసులు రోడ్డుపై నిలిచిన వాహనాలను క్లియర్ చేశారు.
