- మరోమారు ప్రజలు పట్టం కట్టబోతున్నారు
- ‘ఆటవిక రాజ్య’ నేతలు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం
- ప్రజల్లో మార్పు గమనించాను: ప్రధాని నరేంద్రమోడీ
బీహార్ గత ఇరవై ఏళ్లలో కనీవినీ ఎరగని విజయాన్ని ఎన్డీయే కూటమి ఈసారి సాధించబోతోందని, ఓటర్లు ఆ మేరకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. మరోమారు ఎన్టిఎదే బీహార్ అని అన్నారు. ప్రజల్లో కనిపిస్తున్న మార్పునకు ఇది సంకేతం అన్నారు. ‘ఆటవిక రాజ్య’ నేతలు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
బిహార్లో తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రతిచోటా మునుపటి సభకంటే భారీగా ప్రజలు వస్తున్నారని, ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున పాల్గొంటున్నారని చెప్పారు. బిహార్ భాజపా- ఎన్డీయే మహిళా కార్యకర్తల్ని ఉద్దేశించి మంగళవారం ఆయన నమో యాప్ ద్వారా ప్రసంగించారు. ‘మేరే బూత్.. సబ్సే మజ్బూత్’ అనే సంకల్పంతో భాజపా మహిళా కార్యకర్తలు అమోఘమైన కృషి చేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు.
బిహార్ ఎన్నికలను నేనెంతో క్షుణ్నంగా పరిశీలిస్తున్నాను. అందువల్ల ఎన్డీయేదే గెలుపు అని ఖాయంగా చెప్పగలను. విజయంపై నాకెలాంటి సందేహం లేదు. పోలింగ్ మాత్రం ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. మహిళల సులభతర జీవనాన్ని మెరుగుపరడానికి, వారికి సాధికారత కల్పించడానికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు.
ఎన్డీయే విజయం కోసం బిహార్ ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పిన ఓ మహిళతో మోడీ మాట్లాడుతూ.. పేదలు, దళితులు, మహా దళితులు, బీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల్లోనూ ఇదే భావన ఉందని అన్నారు.

