- దివ్యాంగుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన జవహర్నగర్ పోలీసులు
అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న 24 ఏళ్ల దివ్యాంగుడు అఖిల్ పదిహేను రోజుల క్రితం అదృశ్యం కాగా, జవహర్నగర్ పోలీసులు ప్రత్యేక చొరవతో ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. గత నెల 26న ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అఖిల్ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు జవహర్నగర్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై పలు వార్తాపత్రికలు, చానళ్లలో వచ్చిన కథనాలకు స్పందించిన జవహర్నగర్ ఠాణా సీఐ సైదులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. తన పేరు, చిరునామా, తల్లిదండ్రుల ఫోన్ నంబర్ సైతం చెప్పలేని పరిస్థితిలో ఉన్న అఖిల్ ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాల్గా మారింది. పోలీసులు అంబేద్కర్ నగర్ నుంచి బోయిన్పల్లి వరకు 100కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించి అఖిల్ కదలికలను గుర్తించారు. మరోవైపు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తూ మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు.

సేదించిన వికలాంగుడి జాడ
ఈ క్రమంలో బాలానగర్లో మున్సిపల్ సిబ్బంది అఖిల్ను గుర్తించి జవహర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ సైదులు ప్రత్యేక బృందాన్ని బాలానగర్కు పంపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అఖిల్కు దుస్తులు అందించి సురక్షితంగా కారులో పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండ్రులను పిలిపించి అఖిల్ను వారికి అప్పగించారు.

తప్పిపోయిన కుమారుడు తిరిగి తమ ఒడికి చేరడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అఖిల్ ఆచూకీ కనుగొని తమ కుమారుడిని క్షేమంగా అప్పగించిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందికి, సమాచారాన్ని అందించిన మున్సిపల్ సిబ్బందికి, వార్తలను ప్రచురించిన మీడియా ప్రతినిధులకు తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
