- దేశ సమగ్రతను కాపాడటమే జనసేన లక్ష్యం..
- 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన జనసేన..
జనసేన పార్టీ ఢిల్లీ వేదికగా ‘జనసేన ప్రస్థానం-జాతీయ సమగ్రత కోసం’ అనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, అధికారం కోసం తాను పార్టీ పెట్టలేదని, దేశ సమగ్రతను కాపాడటమే జనసేన ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పన్నెండేళ్లలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామని పవన్ గుర్తుచేశారు.
కొన్ని పార్టీలు కేవలం తమ మనుగడ కోసం దేశ సమగ్రతను పణంగా పెడుతున్నాయని ఆరోపించారు. దేశ స్ఫూర్తిని ప్రతి తరం ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. తాను తెలంగాణ ఏర్పాటును ఎన్నడూ వ్యతిరేకించలేదని, కాంగ్రెస్ పార్టీ ఏపీని విభజించిన తీరుపైనే ఆనాడు ఆవేదన వ్యక్తం చేశానని వివరించారు. విభజన జరిగిన తీరు రెండు రాష్ట్రాల మధ్య అసంతృప్తిని, అశాంతిని మిగిల్చిందని, ఆస్తుల పంపకాల వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు.
“ఢిల్లీకి వచ్చి మెడలు వంచుతామని మాట్లాడే నాయకులు ఇక్కడికి రాగానే మౌనంగా ఉండిపోతారు” అని ఆయన అన్నారు. దేశ రక్షణకు, భద్రతకు ఢిల్లీ ప్రధాన కేంద్రమని, భారత రాజ్యాంగం పుట్టిన చోటు కాబట్టే జాతీయ సమగ్రతపై మాట్లాడేందుకు ఈ వేదికను ఎంచుకున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
