- దేశంలోని దక్షణ దీవిలో తీవ్ర భూకంపం..
- 6.3 తీవ్రతతో భూమి కంపించింది..
- సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు..
న్యూజిలాండ్లో భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ దీవిలో గురువారం 6.3 తీవ్రతతో భూమి కంపించడంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పశ్చిమ తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళితే, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫియోర్డ్ల్యాండ్ రీజియన్లోని టె అనౌకు 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా మిల్ఫోర్డ్ సౌండ్ నుంచి ప్యూసెగుర్ పాయింట్ వరకు ఉన్న దక్షిణ దీవి పశ్చిమ తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రపు అలలు తీరప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు తక్షణమే ఎత్తైన ప్రదేశాలకు లేదా లోతట్టు ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నడిచి, పరిగెత్తి లేదా సైకిళ్లపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియన్, పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దులో న్యూజిలాండ్ ఉండటంతో ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 2011లో సంభవించిన క్రైస్ట్చర్చ్ భూకంపం 185 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. తాజా భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ప్రధాన ఆస్తి నష్టం గానీ జరిగినట్లు ఇంకా సమాచారం అందలేదని, పరిస్థితిని సమీక్షిస్తున్నామని జాతీయ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ (ఎన్ఈఎంఏ) అధికారులు తెలిపారు.
