నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేస్తున్న అరాచకం..
- కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినా కదలని ఫైళ్లు..
- బట్టబయలైన సర్వే నంబర్ల మార్పిడి..
- అయినా మౌనంగా ఉంటున్న అధికారులు
- సర్వే నంబర్ 103లో అనుమతి.. 182లో నిర్మాణం..
- ఎకరం భూమి అక్రమమని తేల్చిన తహసీల్దార్ నివేదిక…
- ఏసీపీ, సీసీపీల మాయాజాలం?..
- ఫైళ్లను తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు..
- నిబంధనలను తుంగలో తొక్కిన వైనం.
- కార్పొరేషన్ ప్రతిష్టకు భంగం..
- బడా కంపెనీల అక్రమాలపై అడ్డుకట్ట వేయని ఎం.ఎం.సి..
- కమిషనర్ గారూ.. చర్యలు ఎప్పుడో..?
- ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలోనే బరితెగింపు..
నగరంలోని బేగంపేట్ నడిబొడ్డున నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మాణ వ్యవహారం, ఇప్పుడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్.ఎమ్.సీ.) అధికారుల నిర్లక్ష్యాన్ని చాటిచెబుతోంది. ఒకవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆధారాలతో కూడిన నివేదికలు అందుతున్నా, టౌన్ ప్లానింగ్ విభాగం కళ్ళున్నా చూడలేని కబోదుల్లా వ్యవహరించడం వెనుక ఉన్న ‘మతలబు’ ఏమిటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

నివేదికలు స్పష్టం.. చర్యలు మాత్రం శూన్యం!
మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ నుంచి అందిన లేఖ (లేఖ సంఖ్య. ఈ2/2750/2025, తేది: 09-04-2026) ప్రకారం.. సర్వే నంబర్లు 103/1, 103/2లలో నిర్మాణానికి ఎం/ఎస్ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (రిప్రజెంటెడ్ బై ఎం.ఏ. సత్తార్), డెవలపర్ ఎం. రవి కుమార్, ఆర్కిటెక్ పి. హర్షవర్ధన్, స్ట్రక్చరల్ ఇంజనీర్ పి. విష్ణువర్ధన్, అప్పటి సిటీ ప్లానర్ ఎం. తులసీరామ్ ద్వారా అనుమతులు (పర్మిట్ నంబర్: 2500/జిహెచఎంసి/సికింద్రాబాద్/2022-బిపి) పొందింది.

అయితే, వాస్తవానికి ఈనిర్మాణం సర్వే నంబర్ 182లో సుమారు 1 ఎకరం 08 గుంటల (4856.22 చదరపు గజాలు) విస్తీర్ణంలో అక్రమంగా సాగుతోందని బాలా నగర్ తహసీల్దార్ క్షేత్రస్థాయి పరిశీలనలో తేల్చి చెప్పారు. ఇట్టి విషయంపై పూర్తి ఆధారాలతో “ఆదాబ్ హైదరాబాద” జూలై 2025లోనే అప్పటి జిహెచఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఇంతటి స్పష్టమైన ఆధారాలు, లొకేషన్ స్కెచ్లు, విలేజ్ మ్యాప్లు టౌన్ ప్లానింగ్ అధికారుల చేతిలో ఉన్నప్పటికీ, వారు మౌనం వహించడం వెనుక భారీస్థాయిలో కరెన్సీ చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

‘ఏసీపీ’, ‘సీసీపీ’ల ఫైళ్ల మాయాజాలం?
టౌన్ ప్లానింగ్ విభాగంలోని కీలక అధికారులు, ముఖ్యంగా ఏసీపీ శ్రావణి, సీసీపీ ప్రదీప్ కుమార్ ఈ ఫైళ్లను కావాలనే తొక్కిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చట్టం ఏం చెబుతోంది? :
1955 హెచఎంసీ చట్టం ప్రకారం.. అనుమతి పొందిన స్థలంలో కాకుండా వేరే చోట నిర్మాణం చేపడితే, ఆ అనుమతులను తక్షణమే రద్దు చేసి నిర్మాణాన్ని నిలిపివేయాలి.

అధికారుల తీరు :
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంతటి అక్రమ నిర్మాణం సాగుతున్నా, తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం అధికారుల బరితెగింపుకు పరాకాష్ట.
కార్పొరేషన్ పరువు తీస్తున్న అధికారులు :
కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టను ఈ వ్యవహారం మసకబారుస్తోంది. సామా న్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటే వంద నిబంధనలు పెట్టే అధికారులు, బడా కంపెనీలు ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూములను, ఇతర సర్వే నంబర్లను ఆక్రమిస్తుంటే ఎందుకు మిన్నకుంటున్నారు?
జిల్లా కలెక్టర్ పంపిన రిపోర్టుపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే, ఈ అధికారులపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. కమిషనర్ జోక్యం చేసుకుని, ఈ “నవయుగ” అరాచకానికి అడ్డుకట్ట వేస్తారా? లేక అవినీతి అధికారుల అండతో ఈ అక్రమ నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.
