- సీఎం అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు..
- అది చూసి నవ్వుకున్న జనాలు..
రైతులకు సమాచారం కోసం ఒక హెల్ప్లైన్ నంబర్ను సీఎం ప్రారంభించారు. దాని పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఇది చూసి అక్కడున్న జనం నవ్వుకున్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. రైతులకు వ్యవసాయంలో సూచనలు, సమాచారం కోసం ఉచిత రైతు హెల్ప్లైన్ నంబర్ 155253ను సీఎం మోహన్ యాదవ్ ప్రారంభించారు. ఆ తర్వాత దాని పరితీరును తెలుసుకునేందుకు ప్రత్యక్షంగా ఆ హెల్ప్లైన్కు డయల్ చేశారు.
కాగా, తనను తాను సాధారణ రైతుగా సీఎం మోహన్ యాదవ్ పరిచయం చేసుకున్నారు. వేసవికి అనువైన పంటను సూచించమని ఆ హెల్ప్లైన్ను అడిగారు. అయితే ‘ప్రస్తుతానికి మా వద్ద ఎలాంటి సమాచారం లేదు’ అని హెల్ప్లైన్ ఆపరేటర్ నుంచి సమాధానం వచ్చింది. సంబంధిత అధికారి ఆయనను సంప్రదించి సమాచారం ఇస్తారని బదులిచ్చింది. ఇది విని అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు. దీంతో సీఎం వెంటనే మైక్ ఆపివేశారు.
మరోవైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఈ వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. యంత్రాంగం సిద్ధంగా లేకుండానే రైతు హెల్ప్లైన్ ప్రారంభించారని విమర్శించారు.
