- పశ్చిమాసియా దేశాలకు ఆయుధాల విక్రయం..
- చర్చనీయాంశమైన ఈ పరిణామం..
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియా దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుండగానే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇజ్రాయెల్, కువైట్, ఖతార్, యూఏఈ లాంటి మిత్ర దేశాలకు దాదాపు 8.6 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఆయుధాల విక్రయానికి యూఎస్ విదేశాంగశాఖ ఆమోదం తెలిపింది.
ఈ ప్యాకేజీలో అనేక అధునాతన సైనిక పరికరాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్యాకేజీ నుంచి ఖతార్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన పేట్రియాట్ వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థలతోపాటు అత్యంత కచ్చితత్వంతో కూడిన లక్ష్యాలను ఛేదించగల ఆయుధ వ్యవస్థలను అందుకోనుంది. కువైట్కు సుమారు 2.5 బిలియన్ డాలర్ల ఆయుధాలు వెళ్లనున్నాయి.
ఈ క్రమంలోనే ఇజ్రాయెల్, యూఏఈలకు గైడెడ్ రాకెట్ లాంఛర్లను యూఎస్ విక్రయించనుంది. సాధారణంగా ఆయుధ విక్రయాలను అమెరికా కాంగ్రెస్ రివ్యూ చేస్తుంది. అయితే ట్రంప్ యంత్రాంగం అత్యవసర అధికారాలను ఉపయోగించి త్వరగా ఈ విక్రయాలు జరపాలని నిర్ణయించింది. ఈ చర్యను యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు.
