ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఓట్లడుగుతున్నారు
టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్
6 గ్యారెంటీల అమలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడటం హాస్యాస్పదమని టీపీసీసీ అధికార ప్రతినిధి (TPCC official spokesperson) బండి సుధాకర్ గౌడ్ (Bandi Sudhakar Goud) అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Bye Election) ప్రచారంలో భాగంగా రహమత్ నగర్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన వాగ్దానాలను రేవంత్ సర్కారు (Revanth Government) ఒక్కొక్కటిగా అమలుచేస్తుంటే కిషన్ రెడ్డి కళ్లుండీ చూడలేని కబోదిగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
11 ఏళ్లుగా అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి తన ఎంపీ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏపాటి నిధులు తెచ్చారో ఈ మురికివాడల సాక్షిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి మళ్లీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చారో చెప్పాలన్నారు. కేంద్రంలోని బీజేపీ (Bjp) ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి పేదవాడి బ్యాంకు అకౌంటులో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (Brs) ప్రభుత్వం కూడా జూబ్లీహిల్స్ పేదలకు చేసిందేమీ లేదని అన్నారు.
బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే ఇంకా ఈ పేదలు సమస్యలతో ఎందుకు సతమవుతున్నరో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరంటు ఇస్తున్నదని, కొత్త రేషన్ కార్డులిచ్చిందని, 70 వేలకు పైగా కొత్త ఉద్యోగాలిచ్చిందని బండి సుధాకర్ గౌడ్ చెప్పారు.

