- గబ్బిలాలపేటలో ప్రజల ప్రాణాలతో చెలగాటం
- వర్షాకాలంలో మరింత పెరిగిన ప్రమాదం
- ఫిర్యాదులు చేసినా స్పందించని విద్యుత్ శాఖ అధికారులు
జవహర్నగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని గబ్బిలాలపేటలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లపై, రహదారులపై అస్తవ్యస్తంగా వేలాడుతున్న తీగలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ షాక్లు, షార్ట్ సర్క్యూట్లు, అగ్నిప్రమాదాల ముప్పు మరింత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు రహదారులపై వెళ్లే సమయంలో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగల సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన తీగలను వెంటనే సరిచేయాలని కోరుతున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అధికారులు స్పందించి విద్యుత్తు స్తంభాలని ఏర్పాటు చేసి. అప్రమత్తమై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
“ప్రజల ప్రాణాలు ముఖ్యమా? లేక ప్రమాదం జరిగిన తర్వాత చర్యలా?” అంటూ గబ్బిలాలపేట ప్రజలు విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
