- ప్రథమ స్వాతంత్య్ర సమర చారిత్రక నేపథ్యం
ఆధునిక భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వలస పాలన, విధానాలకు వ్యతిరేకంగా జరిగిన గొప్ప చారిత్రక సంఘటనే ‘1857 సిపాయిల తిరుగుబాటు’. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ… బెంగాలు నవాబు, ఆయన ఫ్రెంచి మిత్రుల కూటమికి 1757 జూన్ 23న ప్లాసీ నిర్ణయాత్మక యుద్ధం జరగగా, తర్వాత వందేళ్లకు ఈ తిరుగు బాటు చోటు చేసుకుంది. దీనినే ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’, ‘సిపాయిల పితూరి’, ‘విప్లవోద్యమం’గా చరిత్రకారులు అభివర్ణించారు. వీరసావర్కర్ తాను రచించిన గ్రంథం ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో సిపాయిల తిరుగుబాటు ప్రథమ స్వాతంత్య్ర సమరమని పేర్కొనడం జరిగింది.
1857 మే 10 న మీరట్లో సిపాయీలతో మొదలైన తిరుగుబాటు, మే 11న సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్ షా నివాసమైన ఎర్రకోటని ఆక్రమించడం, ఈ క్రమంలో తిరుగుబాటు దారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిష్ వారికీ ఢిల్లీకి దగ్గరలోని బద్-కీ-సరై లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటు దారులను ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. “ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది”.
తిరుగు బాటుకు ముఖ్య కారణ నేపథ్యాన్ని పరిశీలిస్తే…1856 డిసెంబరులో బ్రిటిష్ పాలకులు రాయల్ ఎన్ఫీల్డ్ (పి/53 లీ ఏన్ఫిల్డ్ రైఫిల్ 557 కాలిబర్) తుపాకీని ప్రవేశ పెట్టారు. దానికి వాడే తూటాల చివరి భాగాన్ని నోటితో కొరికి ఉపయోగించాల్సి ఉండేది. ఈ తుటాల చివర ఆవు పంది కొవ్వు పూసినట్లు వదంతులు వ్యాపించాయి. ఆవు హిందువులకు పవిత్రం, పంది ముస్లింలకు నిషేధం. కాబట్టి తూటాలను కొరకడాన్ని భారతీయ సిపాయిలు నిరాకరించారు.
ఈ కొత్తరకం తుపాకులు ఇంగ్లండ్ లో ఆయుధ ఫ్యాక్టరీలో తయారయ్యేవి. ఇది హిందూ, ముస్లిం సైనికులను క్రైస్తవులుగా మార్చడానికి పన్నిన కుట్రగా భావించిన సిపాయిలు తిరుగుబాటుకు పూనుకున్నారు. ఆయితే బ్రిటీష్ వారు ఆ తూటాలను మార్చామనీ, కొవ్వులను తేనె పట్టునుండి లేదా నూనె గింజల నుండి సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేక పోయాయి.

1857 మార్చినెలలో 34వ దేశీయ పదాతి దళానికి చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జంట్ మీద దాడిచేసి ఆయన సహాయకుని గాయ పరచాడు. జనరల్ హెన్రీ మంగళ్ పాండేను మతపిచ్చి పట్టినవాడిగా భావించి, మంగళ్ పాండేను బంధించమని జమేదార్ని ఆజ్ఞాపించటం, జమేదార్, హెన్రీ ఆజ్ఞను తిరస్కరించటంతో తిరుగుబాటు ప్రారంభానికి అంకురార్పణ జరిగింది. బ్రిటీష్ వారు మంగళ్ పాండేను, జమేదారును ఏప్రిల్ 8న ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు. మే 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు.
మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్ షా నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్ షా తొలుత అంగీకరించక పోయినా, తరువాత ఒప్పుకొని తిరుగు బాటుకు నాయకత్వాన్ని వహించాడు. 1857 మే 10న మీరట్లోని బెంగాల్ అశ్విక దళంలో కొందరు సైనికులు ఢిల్లీ వైపు రావడంతో ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. మీరట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోలు తిరుగుబాటు తలెత్తిన ముఖ్య ప్రాంతాలు.
బ్రిటిష్ వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బల ప్రయోగంతో తిరుగు బాటుని అణచి వేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ యుద్ధంలో పాల్గొన్న పటాలాలనీ, చైనా వెళ్ళేందుకు బయలు దేరిన ఐరోపా పటాలాలని తిరుగు బాటును అణచి వేసేందుకు వినియోగించారు. తిరుగుబాటు దారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిష్ వారికీ ఢిల్లీకి దగ్గరలోని బద్-కీ-సరై లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటు దారులను ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. “ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది”. ఒకవారం పాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటు దారుల మీద బ్రిటీష్ వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు.
1857 మే 10 న మీరట్లో సిపాయీలతో మొదలైన తిరుగుబాటు, ఉత్తర గంగా మైదానంలోను, మధ్య భారతంలోనూ పౌర తిరుగు బాటుగా మారి. తూర్పు భారత దేశంలో కూడా తిరుగుబాటు విస్తరించి, ఆయా ప్రాంతాల్లో బ్రిటిషు వారి అధికారాన్ని పెద్ద ఎత్తున సవాలు చేసి,1858 జూన్ 20 న తిరుగుబాటు దార్లను ఓడించడంతో పూర్తయింది. అలా ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం వైఫల్యంతో ముగిసింది.
