- మోతిగల్లి ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో కార్యక్రమం..
- ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన 96 మంది పేషెంట్లు..
ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి, మోతిగల్లి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ మహాకాళేశ్వర దేవాలయం, మీరాలం మండీ వద్ద ఉచిత హోమియో వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు. వివిధ రకాల దీర్ఘకాలిక, తక్షణ వ్యాధులకు సంబంధించి రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన హోమియో మందులు పంపిణీ చేయబడినవి.
ఈ శిబిరం విజయవంతానికి గాజుల అంజయ్య, రాహుల్, ప్యారసాని వెంకటేష్, తదితరుల సహకారం విశేషంగా ఉపయోగపడింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. లక్ష్మీ దేవి మార్గదర్శకత్వంలో కార్యక్రమం సజావుగా జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ పి. లక్ష్మీ దేవి, సూపరింటెండెంట్, డా. సి.హెచ్. అరుణ, డా. పి. రాధాకృష్ణ మోహన్, ఇతర వైద్య సిబ్బంది విశేష సేవలు అందించారు. ఇదిలా ఉండగా, నవనీత (ఫార్మాసిస్ట్), అనిత, వరలక్ష్మి, అస్లాం, జూనియర్ డాక్టర్లు పాల్గొని శిబిర నిర్వహణకు కావలసిన సహకారాన్ని అందించారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో హోమియోపతి వైద్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆరోగ్య పరిరక్షణకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడినదని నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరం విజయవంతానికి సహకరించిన దేవాలయ కమిటీ సభ్యులకు, స్థానిక ప్రజలకు, సిబ్బందికి ఆసుపత్రి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇలాంటి సేవా కార్యక్రమం ఏప్రిల్ 10న హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ శామ్యూల్ హానిమాన్ 271వ జన్మ దినం సందర్భంగా మరొకసారి నిర్వయింపబడుతుందని తెలియజేశారు సుపరింటెండెంట్ డాక్టర్ పి లక్ష్మీదేవి.
