- సూపర్ 8లో ఘోరంగా విఫలమైన భారత జట్టు..
లీగ్ దశలో ఓటమెరుగని భారత జట్టు కీలకమైన సూపర్ 8లో మాత్రం ఘోరంగా విఫలమైంది. దక్షిణాఫ్రికా టాపార్డర్ జోరుకు కళ్లెం వేసి.. మధ్యలో పట్టు సడలించి.. ఆఖర్లో పంజా విసిరిన టీమిండియా.. ఛేదనలో మాత్రం తేలిపోయింది. 188 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మనిపిస్తుందనుకుంటే.. సమిష్టి వైఫల్యంతో సఫారీలకు సరెండరైంది. ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్ సేన పోరాడకుండానే మ్యాచ్ను అప్పగించేసిందనే బాధ అభిమానులను వెంటాడుతోంది. 76 పరుగుల తేడాతో ఓడిన కారణంగా నెట్ రన్రేటు మైనస్లో ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ సెమీస్ చేరడంపై సందిగ్ధం నెలకొంది.
గ్రూప్ ఏ నుంచి టేబుల్ టాపర్గా సూపర్ 8లో అడుగుపెట్టిన భారత జట్టును నేలకు దించింది దక్షిణాఫ్రికా. ప్రస్తుతం భారత్ నెట్రన్రేటు మైనస్(-3.800)లో ఉంది. చివరి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ అవకాశాలుంటాయి. ఫిబ్రవరి 26న చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో.. మార్చి 1న వెస్టిండీస్తో సూర్యకుమార్ సేన తలపడనుంది.
