- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
2వ దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లోకి ముగ్గురు కంటే ఎక్కువ అనుమతించరాదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఆదివారం రెండోదశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వనపర్తి మండలంలోని రాజపేట, మదనాపురం మండలంలోని రైతు వేదిక, ఆత్మకూరు మండల పరిధిలోని పిన్న చర్ల గ్రామపంచాయతీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎలాంటి పొరపాటులకు తావులేకుండా సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఫారం – 1 ప్రచురణ చేశారా లేదా అని కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు నామినేషన్లను స్వీకరించిన అనంతరం సాయంత్రం టి పోల్ యాప్ లో అప్డేట్ చేయాలని ఆదేశించారు.

