చదువే ధ్యేయంగా బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థి దశలో చదువే ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితేనే బలమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఉద్ఘాటించారు. చిన్న వయసులోనే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలని సూచించారు.

సోషల్ మీడియాకు పరిమితి… పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇవ్వాలి…
ప్రతి విద్యార్థి రోజుకు నిర్దిష్ట సమయాన్ని చదువుకు కేటాయించాలని, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్, ఇన్స్టాగ్రామ్ల వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని ఆమె కోరారు. పుస్తక పఠనం ద్వారా నైపుణ్యాభివృద్ధి సాధించుకోవాలని, ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకుని, వాటిని సాధించే దిశగా ప్రతిరోజూ కృషి చేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు.ఆడపిల్లలు మగపిల్లల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని, అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని కలెక్టర్ భరోసా ఇచ్చారు. చదువుకుంటే డాక్టర్లు, కలెక్టర్లుగా తయారయ్యే అవకాశం ఉందని తెలిపారు. మనసులో ఏది బలంగా అనుకుంటే ఆ విధంగా తయారవ్వవచ్చని, తమ లక్ష్యసాధన కోసం కష్టపడాలని విద్యార్థినులకు ఆమె ఉద్బోధించారు.ఈ కార్యక్రమంలో బాలికల కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి,లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.
