వైశాఖ పౌర్ణమికి పలువిధ ప్రత్యేకత లున్నాయి. ఇరవై ఏడు నక్షత్రాలలో విశాఖ పదహారోది. విశాఖ ఐదు నక్షత్రాల కూటమి. అది కుమ్మరి సారె లాగ ఉంటుంది. విశాఖకు కాంతిని వ్యాపింప చేసేది అని అర్థం. అట్టి విశాఖ నక్షత్రంతో కూడిన పున్నమకు “వైశాఖి” అని పేరు. ఈనాడు బుద్ధ జన్మ మహోత్సవమని నీలమత పురాణం చెపుతున్నది. వైశాఖి నాడు ధర్మరాజు ప్రీతిని కోరి దానాలు చేయాలని, ఈదినం చేసే దానాలు అనంత ఫలాన్ని ఇస్తాయని తిథితత్వము చెపుతున్నది. గంగా ద్వారే విశిష్ట ఫలదా అంటారు. ఈనాడు సోమవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి సూచిస్తున్నది. వైశాఖ పూర్ణిమను మహా వైశాఖీ అని పంచాంగాలు పేర్కొంటున్నాయి.

అరవ వారు “వెయ్ కాసి విశాఖ” అంటారు. వెయ్ కాసి విశాఖ మాసా నికి అరవ పేరు. యమ ధర్మరాజు పూజలందుకునే దినంగా పాటిస్తారు. విశాఖ నక్షత్రానికి కాంతిని వ్యాపింప చేసే వైశాఖి పర్వదినం నాడు సుబ్రహ్మణ్య స్వామి అవతారం ఎత్తినట్లు చెపుతారు. నమ్మాళ్వారు అనే వైష్ణవ స్వామి గొప్ప వైష్ణవ రుషి, వేదాలను అరవంలో చెప్పిన ఘనులు తిరువన్వేలి జిల్లా తిరునగరిలో వైశాఖ పూర్ణిమ నాడే పుట్టువు నొందా రని, ఆ ఊరికి ఆళ్వారు తిరునగరి అని పేరు వచ్చినట్లు కథనాలు. కూర్మావతారం ఈనాడే పాదుర్భవించిందని పేర్కొన బడింది. కనుక కూర్మ జయంతి జరపడం అనవాయితీగా వస్తున్నది.
దశావతారాలలో కూర్మ, బుద్దావతారాలు రెండూ ఈనాడే ప్రారంభం గావడం గమనార్హం. బుద్ధుడు ఈరోజుననే పుట్టువునొం దడం జరిగింది. బుద్ధుడు లుంబినీ వనంలో సాల వృక్షచ్ఛాయలో జన్మించిందీ, గౌతముడు గయలో మర్రిచెట్టు కింద బుద్ధుడు అయిందీ, కుసినర గ్రామంలో సాలవృక్షం కింద నిర్యాణం చెందినదీ వైశాఖ పూర్ణిమ నాడే కావడం విశేషం. వైశాఖ పౌర్ణమి నాడు శివుడు దేవతల ప్రార్ధనపై, ఉగ్ర నరసింహుని శాంతింప చేసేందుకు సింహాన్ని సైతం చంపగలిగిన శక్తిగల ఎనిమిది కాళ్ళ శరభావతారం ఎత్తారని పురాణ కథనం. శరభ రూప శివుడు, నరసింహమును హతమార్చి, చర్మమును కప్పుకున్నట్లు చెపుతారు.

వైశాఖ పౌర్ణమి పర్వదినాన నదీ స్నానం, దానధర్మాచరణ గావించడం పరిపాటి. వైశాఖంలో ఎండలు బాగా ముదురుతాయి. రాత్రి పగలు తేడా లేకుండా ఉక్కపోత అధికంగా ఉంటుంది. వైశాఖీ నాడు బ్రహ్మపు రాణం దానమిస్తే బ్రహ్మలోకం ప్రాప్తిం చగలదని చెపుతారు. కాగా మన పెద్దలు దధ్యాన్నం, వ్యజన, ఛత్ర, పాదుకోపానహ మున్నగు దానాలు, కృష్ణాజిన దానం, ఉదకుంభ దానం చేసే ఆచారాలను ఏర్పరిచారు. తులసి, అశ్వత్థ మున్నగు వృక్షాలకు ఈ మాసంలో నీరు పోయడం పుణ్య కార్యంగా భావించ బడుతుంది. తంజావూరు చెంతగల తిరుమాఘవాడిలో ఈశ్వరుని వాహనమైన నందీశ్వరుడు పుట్టువు నొందడం జరిగిందనీ, వైశాఖి నాడు శివుడు అక్కడ గొప్పగా నృత్యం చేశారని వాడుక. అక్కడ వైశాఖి నాడు ఉత్సవం చేయడం పరిపాటి.
