శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టు టన్నెల్ (Tunnel) పనులు కొనసాగించడానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) సమక్షంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే (Heliborne Aerial Electromagnetic Survey) కార్యక్రమం ప్రారంభమైంది.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి.. సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ -1 (ఔట్ లెట్ సీ- పాయింట్) వద్ద హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే కోసం హెలికాప్టర్లో ఏర్పాటు చేసిన అత్యంత అధునాతన ట్రాన్స్మిటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని (Advanced Transmitter Technology) పరిశీలించారు.

- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భుగర్భ స్థితిగతులను తెలుసుకునే అంశాలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు (Scientists) వివరించారు. ఎస్ఎల్బీసీ పనులను కొనసాగించడానికి టన్నెల్ ప్రాంతంలో 800-1000 మీటర్ల లోతులో షియర్ జోన్ (రాతి), నీటి ప్రవాహాలు, వాటి తీవ్రతను గుర్తించడానికి ఈ సర్వేను ఉపయోగపడుతుంది.
- సర్వే చేపట్టే విధానంపై శాస్త్రవేత్తలు వివరించిన అనంతరం ముఖ్యమంత్రి.. సర్వే నిర్వహణకు హెలికాప్టర్ టేక్ఆఫ్ కోసం అనుమతించారు. ఆ హెలికాప్టర్ వెంట ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి మరో హెలికాప్టర్లో కొంత దూరం ప్రయాణించి లోలెవల్లో జరిగే ఎక్సర్సైజ్ను పరిశీలించారు.
- సర్వే చేసే ప్రాంతం, సర్వే కోసం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అంశాలపై ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్, శాస్త్రవేత్త డాక్టర్ హెచ్వీఎస్ సత్యనారాయణ, నీటి పారుదల శాఖ సలహాదారు, భారత సైనిక అధికారి పరీక్షిత్ వివరించారు.
- ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, నేనావత్ బాలు నాయక్తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


