- ఆసుపత్రిలో బాంబు పెట్టిన దుండగుడు..
- పోలీసుల అదుపులో నిందితుడు..
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స కోసం డబ్బులు లేవు. దీంతో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు అతడు ప్లాన్ వేశాడు. వైద్యం అందించిన ఆసుపత్రిలో బాంబు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. మే 13న హడప్సర్ ప్రాంతంలోని ఉషా కిరణ్ ఆసుపత్రిలో టైం బాంబు వంటి పరికరాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ను రప్పించారు. ఏడు గంటలు టైమ్ సెట్ చేసి ఉన్న బాంబు వంటి పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఎలాంటి పేలుడు పదార్థం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, పూణేలో కలకలం, భయాందోళన రేపిన ఈ సంఘటనపై ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో నిందితుడి కోసం గాలించారు. చివరకు నేపాల్ పారిపోయేందుకు నాగ్పూర్ రైల్వే స్టేషన్లో వేచి ఉన్న ఆ వ్యక్తిని ఏటీఎస్ సిబ్బంది శుక్రవారం అరెస్ట్ చేశారు.
