- కూకట్ పల్లి నియోజకవర్గంలో నిర్వహణ..
- పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్..
కూకట్పల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు నమోదు చేయిస్తున్న దొంగ, డూప్లికేట్ ఓట్ల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్క ఓటరును కోల్పోకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికీ 24 గంటల పాటు నిరంతరం తాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో తెలంగాణకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని, అదే రీతిలో నగరానికి నిరంతర మంచి నీరు అందించేది కూడా కేసీఆరేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మార్కు పరిపాలనపై పూర్తి అవగాహన ఉండబట్టే, నగర ప్రజలు గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కట్టిన ఫ్లై ఓవర్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఓపెన్ చేస్తూ… తామే కట్టామంటూ అబద్ధాలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో తాము కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, అయితే ఈసారి అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తగిన ప్రాధాన్యత, గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
