- ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్..
- అసత్యప్రచారాలు మానుకోవాలని హితవు..
కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన డీఎస్సీపై వైసీపీ ‘అబద్ధాల ఫ్యాక్టరీ’ నడుపుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలకు హుందాతనం ఉండాలని, కానీ ప్రతీకారం, విధ్వంసం, అసత్య ప్రచారాలే పునాదులుగా వైసీపీ రాజకీయాలు నిర్మితమయ్యాయని విమర్శించారు.
గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర యువత ఉద్యోగాలు లేక నరకం చూసిందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. 2019-2024 మధ్య ఒక్క డీఎస్సీ గానీ, ఒక్క జాబ్ క్యాలెండర్ గానీ విడుదల చేయని ఘనత జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గతంలో తెచ్చిన పరిశ్రమలను కూడా వైసీపీ ప్రభుత్వం తరిమివేయడంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నిరుద్యోగ యువత నుంచి వచ్చిన వినతుల మేరకే, అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు కుప్పంలో హామీ ఇచ్చారని శ్రీకాంత్ గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం, అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు.
డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ వందకు పైగా కోర్టు కేసులు వేయించినా, ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లిందని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో డీఎస్సీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా పూర్తిచేశామని చెప్పారు. ఆన్లైన్ పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన, ఎంపిక ప్రక్రియ మొత్తం ఆధునిక సాంకేతికతతో జరిగిందని వివరించారు.
