- ప్రతి రైతు ఫామ్ పాండ్ల నిర్మాణానికి ముందుకు రావాలి
- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.
మంగళవారం కుంటాల మండలంలోని అంబుగాం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ గ్రామంలోని తాగునీటి వసతి, విద్యుత్, టెలికాం సేవలు, ఇతర మౌలిక సదుపాయాలపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్తులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.




గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపితే వెంటనే నూతన బోరుబావి మంజూరు చేస్తామని తెలిపారు. బోరుబావి ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని, ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
భూగర్భ జలాల సంరక్షణకు ఫామ్ పాండ్లు అత్యంత ఉపయోగకరమని పేర్కొన్న కలెక్టర్, ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్ నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని రైతు ఏర్పాటు చేసిన ఫామ్ పాండ్ను పరిశీలించి, ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రైతులతో పాటు కొత్తగా ముందుకు వస్తున్న రైతులను అభినందించారు. గ్రామంలో మరిన్ని ఫామ్ పాండ్లు ఏర్పాటయ్యేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.




అలాగే గ్రామంలో టెలికాం సేవల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూగర్భ జలాల పరిరక్షణలో ప్రతి గ్రామస్థుడు భాగస్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ పర్యటనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ విజయలక్ష్మి, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ సందీప్, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీఓ వనజ, సర్పంచ్ శివాజీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
