- వాకౌట్ చేసిన స్టాన్ఫర్డ్ స్టూడెంట్స్..
- పాలస్తీనా జెండాలు, బ్యానర్లతో నిరసన..
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రసంగం చేస్తున్న వేళ.. అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు వాకౌట్ చేశారు. యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్లో ఆదివారం సుందర్ పిచాయ్ పాల్గొని ప్రసంగించారు. స్టాన్ఫోర్డ్ స్టేడియంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిచాయ్ ప్రసంగం స్టార్ట్ చేయగానే సుమారు 200 మంది విద్యార్థులు ఆ ఈవెంట్ నుంచి వెళ్లిపోయారు. పాలస్తీనా జెండాలు, బ్యానర్లతో నిరసన చేపట్టారు. పాలస్తీనాకు స్వచ్ఛను ఇవ్వాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా, నో టెక్ ఫర్ అపార్థిడ్ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
అయితే ఇజ్రాయిల్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ నింబస్లో గూగుల్ సంస్థ పాల్గొంటోంది. దీంతో గూగుల్ సంస్థ కార్యకలాపాలను విద్యార్థులు వ్యతిరేకించారు. క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు ఏఐ డీల్స్ గురించి ఇజ్రాయల్తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ టెక్నాలజీని సైనిక చర్యల కోసం వినియోగిస్తారని ఆరోపణలు వస్తున్నాయి. పాలస్తీనియన్లపై నిఘా పెట్టే చంపే బిలియనీర్ వద్దు అంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
