- దుమ్ము ధూళితో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన
కుకునూరు పల్లి మండల కేంద్రంలో నడుస్తున్న రెడ్ మిక్స్ పరిశ్రమ వల్ల వెలువడుతున్న దుమ్ము ధూళి కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ రైతులు గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన రైతులు తెలిపిన వివరాల ప్రకారం, పరిశ్రమ నుంచి వస్తున్న ధూళి చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములపై పేరుకుపోవడంతో పంటలు సరిగా పెరగక దిగుబడి తగ్గిపోతోందని పేర్కొన్నారు. దీనివల్ల తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా, ఈ కాలుష్యం గ్రామ ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నదని రైతులు తెలిపారు. దుమ్ము కారణంగా శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలిసి సమస్యను వివరించి, పరిశ్రమపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయించి, రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు
