- విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. శుక్రవారం లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు.

కలెక్టర్ నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. గణితం, ఇంగ్లీషు తదితర ముఖ్య విషయాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగి, వారి సమాధానాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా, ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత శ్రేణి మార్కులు సాధించాలని సూచించారు.

అనంతరం పాఠశాలలో ఉన్న వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ సరిత, ఎంపీడీవో రాధ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
