కామారెడ్డి : కేసీఆర్ వస్తే ఒక్కడే రాడని, వెంబడి చాలా వస్తాయని కామారెడ్డిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఈ నియోజకవర్గ రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. ఏడాదిన్నర, రెండేళ్లలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి చూపిస్తానని, ఇది నా వాగ్ధానమని సీఎం శపథం చేశారు. కాబట్టి ప్రజలు ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగతదో బాగా ఆలోచించి ఓటేయాలని ఆయన కోరారు. ‘పోయిన ఎన్నికల్లో గంప గోవర్ధన్గారు ఇక్కడి నుంచి పోటీ చేసినప్పుడు కామారెడ్డిని జిల్లా చేస్తం అని హామీ ఇచ్చిన. ఆ మేరకు కామారెడ్డిని జిల్లా చేసుకున్నం. మెడికల్ కాలేజీని కూడా తెచ్చుకున్నం. జిల్లాలోని నాయకులతోపాటు గంప గోవర్థన్ గారు తనను ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరారు. అందుకే వాళ్ల కోరిక మేరకే ఇయ్యాల ఇక్కడి నుంచి పోటీ చేసిన. కేసీఆర్ వస్తే ఒక్కడే రాడు. వెంబడి చాలా వస్తయ్. కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ఏడాదిన్నర, రెండేళ్లలోపు నీళ్లు వచ్చి పారుతయ్. ఇది నా వాగ్ధానం. పెండింగ్లో ఉన్న కాళేశ్వరం పనిని ఆగమేఘాల మీద పూర్తి చేసి ఈ నియోజకవర్గానికి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి చూపిస్తా’ అన్నారు.
‘కేసీఆర్ వెంట చాలా వస్తయ్. విద్యుత్ సంస్థలు వస్తయ్. ఎడ్యుకేషన్ సంస్థలు వస్తయ్. పరిశ్రమలు వస్తయ్. మీరు ఊహించని అభివృద్ధి జరుగుతది. కామారెడ్డి పట్టణంతోపాటు ఇక్కడి పల్లెల రూపురేఖలు కూడా మారుతయ్. చాలా అద్భుతమైన నియోజకవర్గంగా కామారెడ్డిని తయారు చేసే బాధ్యత నాది. అందుకు మీ సహకారం కావాలి. మీరు ఒకటి రెండు సార్లు బాగా ఆలోచించి ఓటేయాలి. ఎవరికి ఓటేస్తే నియోజకవర్గానికి, రాష్ట్రానికి మేలు జరుగుతదో బేరిజు వేసుకోవాలి. అంతేతప్ప ఆగమాగమై ఓటు వేయొద్దు’ అని సీఎం సూచించారు.
తప్పక చదవండి
-Advertisement-