- ప్రభుత్వ కమిటీకి సంగీత దర్శకుడు విష్ణు కిషోర్ వినతి!
తెలంగాణ సచివాలయం పక్కనే ఉన్న అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో శనివారం కళాకారుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కళాకారుల తరఫున ప్రముఖ సంగీత దర్శకులు విష్ణు కిషోర్ పాల్గొని, వారి సమస్యలను, డిమాండ్లను కమిటీ ముందు బలంగా వినిపించారు. కమిటీ సభ్యులైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ శోభన్ రెడ్డి, మంత్రి అద్దంకి దయాకర్, రాములు నాయక్ లతో కూడిన బృందానికి ఆయన ఒక సమగ్ర వినతి పత్రాన్ని అందజేశారు.
ఉపాధి, ఉద్యోగ భృతికై డిమాండ్ :
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే వారికి తగిన ఉద్యోగ భృతిని అందించాలని విష్ణు కిషోర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కళాకారుల హక్కుల రక్షణ :
కళాకారుల సామాజిక భద్రత, వారి హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని ఈ సందర్భంగా కోరారు.
కమిటీ సానుకూల స్పందన :
కళాకారుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్సీ కోదండరాం, మంత్రి అద్దంకి దయాకర్, కమిటీ సభ్యులు.. తెలంగాణ సంస్కృతిని, ఉద్యమాన్ని బతికించిన కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
పోరాట స్ఫూర్తి :
అమరవీరుల స్థూపం సాక్షిగా జరిగిన ఈ సమావేశం, రాబోయే రోజుల్లో కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు ఒక కీలక వేదికగా నిలిచింది.
