- యుద్ధమేఘాలు తొలగిపోతాయని అంచనాలు..
- ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 1100 పాయింట్లు పెరుగుదల..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోతాయనే అంచనాల మధ్య సూచీలు లాభాల్లో కదలాడాయి. దాంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1100 పాయింట్ల వరకు పెరిగింది. సెన్సెక్స్ నేటి ట్రేడింగ్లో 76,135 వద్ద మొదలైంది. చివరకు 1,073 పాయింట్ల లాభంతో 76,488 వద్ద ముగిసింది. నిఫ్టీ 312 పాయింట్లు ఎగబాకి, 24 వేల పైన స్థిరపడింది. నిఫ్టీ సూచీలో ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, టీఎంపీవీ, లార్సెన్ షేర్లు రాణించాయి.
మ్యాక్స్ హెల్త్కేర్, ఓఎన్జీసీ, హిందాల్కో, నెస్లే, బజాజ్ ఆటో స్టాక్స్ నష్టపోయాయి. యుద్ధం ముగించే విషయమై అమెరికా – ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కాస్త దిగొచ్చాయి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 5.58 శాతం తగ్గి, 97.76 డాలర్లకు వచ్చింది. చమురు ధరలు తగ్గడంతో బ్యాంక్ షేర్లు పెరిగాయి. ఆయిల్ ధరల తగ్గుదల కారణంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని, వడ్డీ రేట్లలో స్థిరత్వం వస్తుందని మదుపర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కూడా నేటి లాభాలకు ఓ కారణంగా చెప్పవచ్చు.
