- త్వరలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం–స్థానికులకు హామీ
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని సీతాఫల్మండి మాజీ కార్పొరేటర్ డా.సామల హేమ అన్నారు.శుక్రవారం నాడు సికింద్రాబాద్ సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని బ్రాహ్మణబస్తి ప్రాంతంలో స్థానికులు,జిహెచ్ఎంసి అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.బస్తీలో ఉన్న ప్రస్తుత సమస్యలను పరిశీలిస్తూ,స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు,అవసరాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
బ్రాహ్మణబస్తిలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ పనులు ప్రారంభమైతే రహదారి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని ఆమె తెలిపారు.అలాగే,రోడ్డు పనులు ప్రారంభానికి ముందుగా బస్తీ వాసులు తమ ఇళ్లకు అవసరమైన త్రాగునీటి పైపులైన్లు మరియు డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఒకసారి సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ తవ్వకాలు చేయడం కష్టమవుతుందని,అందువల్ల ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం ఎంతో ఉపయోగకరమని ఆమె తెలిపారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని ఆమె పేర్కొన్నారు.అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా,వేగంగా పూర్తి కావాలంటే ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని,అందరూ కలిసి పనిచేస్తే బ్రాహ్మణబస్తి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జి హెచ్ ఎం సి,డి.ఈ,మాధవి,ఏ.ఈ వేణు, జలమండలి మేనేజర్ కుషాల్,వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
