- మూడు నెలలుగా మంచినీటి మ్యాన్ హోల్ లో కి మురుగు నీళ్లు
- సమస్య పరిష్కరించాలని రుద్రవీణ మహిళా సంఘం డిమాండ్
- జలమండలి జీఎం వినోద్ కు వినతి పత్రం
మూడు నెలలుగా మంచినీటి మ్యాన్ హోల్ లోకి డ్రైనేజీ నీరు చేరి మురికి నీరు సరఫరా అవుతుండడంతో రోగాలపాలై ప్రజలు అవస్ధలు పడుతున్న పరిస్థితి అడ్డగుట్ట శాస్త్రి నగర్ లో నెలకొందని రుద్రవీణ మహిళా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు నక్కల శోభ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి స్థానిక ప్రజలకు దుర్వాసన, రోగాల బారినుండి విముక్తి కలిగించాలని కోరుతూ సోమవారం రుద్రవీణ మహిళా సంఘం అధ్యక్షురాలు నక్కల శోభ, సంఘం ప్రతినిధి విజయలక్ష్మితో కలసి జలమండలి జీ ఎం వినోద్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నక్కల శోభ మాట్లాడుతూ అడ్డగుట్ట డివిజన్ శాస్త్రి నగర్ బస్తి లో గత మూడు నెలల నుంచి మంచినీటి మ్యాన్ హోల్ లోకి డ్రైనేజీ మురికి నీళ్లు చేరడంతో పాటు రోడ్డుపై ఏరులై పారుతుందని తెలిపారు. దుర్గంధం వేదజల్లుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న పరిస్థితులను ఎవరు పట్టించుకోక పోవడం శోచనీయమని అన్నారు. రెక్కడిడితే గానీ డొక్కాడని పేద ప్రజలు అదికంగా ఉన్న ఈ బస్తీలో రోజు విడచి రోజు వచ్చే నల్లా నీరు దుర్గంధ పూరితంగా వస్తుండడంతో ఆ నీటిని త్రాగలేక, త్రాగి రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.
ఎండాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఉహించడానికే బయమేస్తుందని వాపోయారు. ఈ సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకొని వెంటనే పరిష్కరించాలని జీఎం ను కోరినట్లు చెప్పారు. జీ ఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారని వెల్లడించారు.
