Monday, June 22, 2026
Homeరంగారెడ్డి"ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలూ, కమీషన్ లు ముఖ్యమా?

“ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలూ, కమీషన్ లు ముఖ్యమా?

  • మంచిరెడ్డి కిషన్ రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని లష్కర్‌గూడ, సుర్మాయిగూడ, అనాజ్‌పూర్, మజీద్‌పూర్, గుంతపల్లి, గండిచెరువు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ప్రమాదకర బ్రిడ్జి కారణంగా స్థానిక ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ బ్రిడ్జి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారడంతో, ప్రజల సమస్యలను గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కృషితో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు.

అయినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేటికీ పనులు ప్రారంభం కాకపోవడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలతో కలిసి లష్కర్‌గూడ బ్రిడ్జి వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత ఎమ్మెల్యేకు ప్రజల సమస్యల కంటే మంత్రి పదవిపైనే ఎక్కువ ఆసక్తి కనిపిస్తోందని విమర్శించారు. శిలాఫలకాలు మార్చడం కాదనీ పనులు చేసి చూపించాలని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన నిధులు తామే తెచ్చినట్టు చూపెట్టుకోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ బ్రిడ్జి కొరకు 6.40 కోట్ల నిధుల మంజూరు చేయించి, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా శిలాఫలకం వేసి టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా ప్రారంభించకపోవడం ప్రజల పట్ల వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసేలోపు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తేనే ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని తెలిపారు. గతంలో ఈ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో కారు నీటిలో మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనను ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ పార్టీ సహించదని, వారం రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బ్రిడ్జి నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News