- వెల్లడించిన కేంద్ర ఆర్ధిక మంత్రి..
- పని తీరును నిరంతరంగా విశ్లేషించుకోవాలని సూచన..
భారత ఆర్థికవ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందని, అయితే ఈ వృద్ధిని తేలిగ్గా తీసుకోవద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీర్ఘకాలికంగా వృద్ధిని కొనసాగించాలంటే నిరంతర ఆవిష్కరణలు, సంస్కరణలు, వ్యవస్థల బలోపేతం చాలా అవసరమని ఆమె స్పష్టంచేశారు. ఇవాళ జరిగిన ‘మైండ్మైన్ సమ్మిట్ 2026’ లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘మన దేశం ఆర్థికంగా బాగానే రాణిస్తోందని నాకు తెలుసు. కానీ మన పనితీరును మనం నిరంతరం జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ఇంకా ఎక్కడ మెరుగుపరుచుకోవాలో గుర్తించాలి’ అని అన్నారు.
కేవలం ఆర్థికవృద్ధి మాత్రమే సరిపోదని, స్థిరమైన, సమ్మిళిత అభివృద్ధి కోసం బలమైన సంస్థలు, సమర్థవంతమైన విధానాలు, పటిష్ఠమైన మద్దతు వ్యవస్థలు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. భారత్ వంటి పెద్ద, సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని నిలబెట్టుకోవాలంటే సామర్థ్యాలను బలోపేతం చేయడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చూడటం కోసం నిరంతరం కృషి చేయాలని ఆమె సూచించారు. పురోగతి దానంతట అదే వస్తుందని భావించకూడదని, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి నిరంతర కృషి, ఆవిష్కరణలు, సంస్కరణలు తప్పనిసరని ఆమె పేర్కొన్నారు.
అనేక రంగాలు బలంగా రాణిస్తున్నప్పటికీ, ముఖ్యంగా సంక్లిష్టమైన, మధ్యంతర ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన కొన్ని రంగాలకు విధానపరమైన మద్దతు ఇంకా అవసరమని ఆమె అంగీకరించారు. దీర్ఘకాలంగా ఉన్న సవాళ్లను నిర్మాణాత్మక సంస్కరణలు, మెరుగైన అమలు లేదా కొత్త విధానాల ద్వారా ఎలా పరిష్కరించవచ్చో విధానకర్తలు నిరంతరం పరిశీలించాలని అన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంపై కేంద్రమంత్రి కీలక హెచ్చరిక చేశారు. దీని కారణంగా రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని, ప్రభుత్వం అందుకు సిద్ధమవుతోందని తెలిపారు.
