- మండిపోతున్న తెలంగాణ నేల..
- పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్..
దేశంలోకి నైరుతి రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. సాధారణంగా మే చివరి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. వడగాల్పుల ప్రభావం పెరిగితే ఇది మరింత ఆలస్యం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు జూన్ రెండో వారం నాటికి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయి.
మరోవైపు, రుతుపవనాల రాక ఆలస్యమవుతుండటంతో తెలంగాణలో ఎండల తీవ్రత, వడగాల్పులు ప్రాణాలు తీస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
