- డీఎసిపై స్పందించిన ఏపీ విద్యాశాఖ..
మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక పరీక్షల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను ఏపీలోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పకడ్బందీ చర్యలతో పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేసింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
పరీక్షల నిర్వహణలో అనుసరించిన పటిష్ఠమైన భద్రతా విధానాలను ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన టీసీఎస్ అయాన్ ప్లాట్ఫామ్ను ఈ పరీక్షల కోసం వినియోగించినట్టు తెలిపింది. సమాచార భద్రతకు అత్యున్నత ప్రామాణికమైన 256-బిట్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీతో ప్రశ్నపత్రాలను భద్రపరిచామని, దీనివల్ల డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేసింది. పరీక్ష రాసే ప్రతి అభ్యర్థికి 42 లక్షల ప్రశ్నల భారీ బ్యాంక్ నుంచి కంప్యూటర్ ద్వారా యాదృచ్ఛికంగా (Random Shuffling) ప్రశ్నలు వస్తాయని, ఒక అభ్యర్థికి వచ్చిన ప్రశ్నపత్రం మరొకరికి రాదని వివరించింది.
దీనివల్ల మాస్ కాపీయింగ్కు గానీ, ముందుగా ప్రశ్నలు తెలుసుకునేందుకు గానీ ఆస్కారం ఉండదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ప్రతి పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు, వెబ్కాస్టింగ్, సీసీటీవీ నిఘా వంటి బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేసి పరీక్షలు నిర్వహించామని పేర్కొంది. దరఖాస్తు స్వీకరణ నుంచి హాల్ టికెట్ల జారీ, ఆన్లైన్ పరీక్ష, ఫలితాల వెల్లడి, తుది ఎంపిక వరకు ప్రతి దశలోనూ పారదర్శకతకు పెద్దపీట వేశామని ప్రభుత్వం వివరించింది.
