- భార్యను తుదముట్టిస్తూ వీడియో రిలీజ్..
- పోలీసుల దర్యాప్తులో కేసు..
కర్ణాటకలో ఒక కిరాతక ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆమె ప్రాణాలు విడుస్తున్న దృశ్యాలను నిందితుడు వీడియో కాల్ ద్వారా అత్తమామలకు చూపించాడు. బాగల్కోట్ జిల్లాలో వెలుగుచూసిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే, బిళగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గలగలి గ్రామానికి చెందిన ప్రవీణ్ జిగలూర్, భాగ్యశ్రీ (23) దంపతులు. భార్యపై అనుమానంతో ప్రవీణ్ తరచూ గొడవ పడేవాడు. భర్త వేధింపుల తాళలేక భాగ్యశ్రీ రెండు నెలల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే, గతాన్ని మర్చిపోయి అన్యోన్యంగా ఉందామని నమ్మబలికిన ప్రవీణ్ ఆదివారం ఆమెను తిరిగి తన ఇంటికి తీసుకువచ్చాడు. కానీ, ఇంటికి వచ్చిన అదే రోజు సాయంత్రం ఆమెపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా, ఆమె మరణిస్తున్న చివరి క్షణాలను మొబైల్లో రికార్డ్ చేయడమే కాకుండా, నేరుగా ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి చూపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ వీడియోను మరికొందరికి కూడా షేర్ చేసినట్లు సమాచారం.
