జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ వైన్స్ లిక్కర్ మార్ట్ ఎదుట నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ.) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గురువారం జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సి.ఐ. శివశంకర్కు వినతిపత్రం సమర్పించారు. వైన్ షాపులకు వచ్చే వినియోగదారులు తమ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను రోడ్డుపైనే అడ్డంగా నిలుపుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని సి.పి.ఐ. నాయకులు తెలిపారు.
ఈ కారణంగా బస్సులు, ఇతర వాహనాలు తరచుగా నిలిచిపోతుండటమే కాకుండా పాదచారులు కూడా నడవడానికి ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. జవహర్ నగర్ పోలీసులు సాధారణంగా ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ, కొన్ని వైన్ షాపుల యాజమాన్యాల నిర్లక్ష్య ధోరణి కారణంగా సమస్యలు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పార్కింగ్ సౌకర్యం కల్పించకుండా రోడ్లను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, వెంటనే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సి.పి.ఐ. మేడ్చల్ జిల్లా ఇంచార్జి తోటపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా రోడ్లను ఆక్రమించడం సరైంది కాదన్నారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ. కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వి. స్వరూప నాయక్, గిరిప్రసాద్ నగర్ శాఖ కార్యదర్శి కొండా సత్యం సాగర్, ఏ.ఐ.టి.యు.సి. నాయకులు అంబాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
