- ఏ ఐ టెక్నాలజీతో నకిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు..
- ఏకంగా జార్జియా మెలోనీ ఫొటోలే మార్ఫింగ్..
కృత్రిమ మేధతో పెను ప్రమాదం ఉన్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వార్నింగ్ ఇచ్చారు. ఏఐ టెక్నాలజీతో సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇక నకిలీ ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. జార్జియా మెలోనీ లోదుస్తులు ధరించినట్లుగా ఉన్న కొన్ని ఫోటోలు ఇటీవల ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాని సీరియస్ అయ్యారు. ఆమె ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన అనేక ఫేక్ ఇమేజ్లు ఆన్లైన్లో వ్యాప్తి అవుతున్నాయని, ఇవే వాస్తవమైన ఫోటోలు అని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
అయితే ఏఐ వల్ల ఉన్న ప్రమాదాలను ఎత్తిచూపేందుకు స్వయంగా తన ఎక్స్ అకౌంట్లో ఓ నకిలీ ఫోటోను జార్జియా మెలోనీ పోస్టు చేశారు. టెక్నాలజీని దుర్వినియోగం చేసి ఇలాంటి ఫోటోలను రూపొందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత దాడి కన్నా ఎక్కువ ప్రమాదకర అంశమని ఆమె తన వార్నింగ్లో పేర్కొన్నారు. ఏఐ ఆధారిత డీప్ఫేక్లతో చాలా ప్రమాదం ఉందని, ఆ విధానంతో ఎవరినైనా మోసం చేయవచ్చు అని, తలకిందలు చేయవచ్చు అని, ఎవరినైనా దాడి చేయవచ్చు అని ఆమె అన్నారు.
ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, తనను తాను సమర్థించుకోగలను, కానీ ఈ పొజిషన్ అందరికీ ఉండదని ఆమె అన్నారు. ఆన్లైన్ కాంటెంట్ను షేర్ చేస్తున్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. నమ్మడానికి ముందు వెరిఫై చేసుకోవాలని, ఆ తర్వాత షేర్ చేసే ముందు మరోసారి ఆలోచించాలని, ఇలాంటి రూల్ పెట్టుకోవాలని జార్జియా మెలోనీ అన్నారు.
