- సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..
- ఇంత భారీగా ధరలు ఎప్పుడూ పెరగలేదు..
ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మేడే కానుకగా హోటల్ కార్మికులకు ఇచ్చిన బహుమతి కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడమేనని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో రూపాయి పాతాళానికి పడిపోతుంటే, సిలిండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జెండాను కేటీఆర్ ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికుల సంక్షేమం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. సిగాచీ పరిశ్రమలో కార్మికులు ప్రమాదంలో చనిపోతే వారికి ఇప్పటి వరకు పరిహారం అందలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన దానవీర శూరకర్ణలా మాట్లాడారని, ఎన్నికలు అయ్యాక కుంభకర్ణుడిలా మారిపోయాడని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు జేమ్స్ బాండ్లా బాండు పేపర్లు ఎందుకు రాసిచ్చారని ప్రశ్నించారు.
