- వెబ్సైట్ ద్వారా వివరాలు అందచేసే అవకాశం
- కులగణనతో పాటు జనగణన ఈసారి ప్రత్యేకం
- జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి
జనగణన-2027లో భాగంగా తెలంగాణలో ఈ నెల 26 నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి తెలిపారు. సెల్ఫ్- ఎన్యుమరేషన్ పక్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. శనివారం హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి జనగణన ఇది అని పేర్కొన్నారు. డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న తొలి జనగణన కూడా ఇదేనని తెలిపారు. జనాభా లెక్కల సేకరణ వివరాలను ఆమె మీడియాకు వివరించారు.
స్వాతంత్యం తర్వాత తొలిసారి కులగణన జరుగుతుండటం కూడా ఈసారి జనగణనలో ప్రత్యేకమని వివరించారు. ముఖ్యంగా మొదటిసారిగా జనగణన పక్రియలో ఈసారి సెల్ఫ్-ఎన్యుమరేషన్ పక్రియ పాటిస్తున్నామని.. ప్రజలు నేరుగా జనగణనలో పాల్గొనేందుకు ఇది ఒక మంచి అవకాశమని ఆమె చెప్పారు. వెబ్ పోర్టల్ ద్వారా స్వచ్ఛందంగా జనగణనకు తమ వివరాలను అందించవచ్చని తెలిపారు. సెల్ఫ్- ఎన్యుమరేషన్ అనేది తప్పనిసరి కాదని.. కేవలం ప్రజలకు ఒక సౌలభ్యం మాత్రమేనన్నారు.
తెలంగాణ భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి ఇంటినీ లెక్కిస్తామని భారతీ హాళికెరి అన్నారు. ఆస్పత్రి, బడి, గుడి, గుడిసె, అద్దెభవనం ఇలా ఏదైనా జనగణన జరుగుతుందన్నారు. ‘ భవనంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. 2027 ఫిబ్రవరిలో రెండో దశ మొదలయ్యేలోగా అంతా సిద్ధం చేస్తాం. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి వ్యక్తిగత సమాచారం సేకరిస్తాం. ఇళ్ల గణన కోసం బ్లాకులుగా విభజించి ఎన్యుమరేటర్లను కేటాయిస్తాం. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి మార్కు చేస్తారు. ప్రతి భవనంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది మార్కు చేస్తారని ఆమె పేర్కొన్నారు.
