- దొంగను పట్టుకున్న యజమాని కుటుంబం
ఆలేరు పట్టణంలోని భవాని జువెలరీ షాప్లో సోమవారం పట్టపగలు జరిగిన బంగారం దొంగతనం ప్రయత్నం విఫలమైంది. దొంగతనానికి యత్నించిన వ్యక్తిని యజమాని కుటుంబ సభ్యులు ధైర్యంగా పట్టుకోవడంతో పాటు స్థానికులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం, నిందితుడు షేక్ అబ్బాస్ ఆలీ (55), అనంతపురం జిల్లా గుంతకల్ మండలం భాగ్యనగర్ కాలనీకి చెందినవాడిగా పోలీసులు తెలిపారు. అతడు కస్టమర్గా నటిస్తూ నగల దుకాణంలోకి ప్రవేశించాడు. నగలు కొనుగోలు చేయాలనే నెపంతో బంగారు ఆభరణాలు చూపించాలని అడిగాడు. షాప్ సిబ్బంది నగలను చూపిస్తున్న సమయంలో ఒక్కసారిగా వాటిని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు.
అయితే దుకాణ యజమాని కుమారుడు వెంటనే అప్రమత్తమై దొంగను వెంటాడి పట్టుకున్నాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని దొంగను అదుపులోకి తీసుకుని దేహ శుద్ధి చేశారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని తమ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, షాపు యజమాని అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద నష్టం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. నగల దుకాణాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
