యూపీలోని 800 నైపుణ్య కేంద్రాల్లో తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
ఉత్తరప్రదేశ్లోని 800 నైపుణ్య కేంద్రాల్లో(Skill Centres)ని లక్ష మందికి పైగా విద్యార్థులు నిత్యం వార్తా పత్రికలను చదవటం(News Papers Reading) తప్పనిసరి చేశారు. ఈ మేరకు స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. టైమ్ టేబుల్(Time Table)లో దీన్ని చేర్చనున్నారు. వార్తా పత్రికలను క్రమం తప్పకుండా చదవడం వల్ల శిక్షణార్థుల్లో జనరల్ నాలెడ్జ్ పెరుగుతుందని, పోటీ పరీక్షలకు బాగా సిద్ధం కావడానికి కూడా ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఇది ట్రైనీల్లో విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుందని, తార్కిక ఆలోచనను పెంపొందిస్తుందని చెప్పారు. యువత సాంకేతికంగా ప్రావీణ్యం కలిగి ఉండటమే కాకుండా సామాజిక, ఆర్థిక, ప్రపంచ పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని యూపీ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ పేర్కొన్నారు. రోజూ వార్తా పత్రికలను చదవాలనడం వెనక ఉన్న లక్ష్యం.. శిక్షణ పొందినవారి ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడం, వారి ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందించడం అని వివరించారు. వార్తలను విశ్లేషించడం వల్ల యువతలో విమర్శనాత్మక అంతర్దృష్టి ఏర్పడుతుంది. తద్వారా వారు నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. అదే సమయంలో పజిల్స్, సాంస్కృతిక కథనాలు, స్ఫూర్తిదాయకమైన కథలు విద్యార్థుల్లో ఏకాగ్రత, ఓర్పు, సున్నితత్వం వంటి మానవ లక్షణాలనూ అభివృద్ధి చేస్తాయి అని అభిప్రాయపడ్డారు.
