- ఒకప్పుడు కేంద్ర బిందువు. నేడు నిర్లక్ష్యానికి నిదర్శనం
- పంచాయతీలు, ఉద్యమాల సాక్షిగా నిలిచిన ప్రదేశం
- సంరక్షణ లేమితో శిథిలావస్థకు చేరిన గాంధీ పార్క్..
- జాతిపిత విగ్రహం ఉన్నా పట్టించుకోని అధికారులు
- పునరుద్ధరణ కోరుతున్న జిల్లా ప్రజలు
- ప్రజా పాలన లోనైనా గాంధీ పార్క్ అభివృద్ధి జరిగేనా!
ఒకప్పుడు సూర్యాపేట పట్టణానికి హృదయంగా నిలిచిన గాంధీ పార్క్ నేడు నిర్లక్ష్యానికి గురై మూతపడి ఉండడం పట్టణ ప్రజలను కలవరపెడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, పోస్టాఫీస్, కోర్టు, జైలు, బస్టాండ్, వ్యవసాయ మార్కెట్ వంటి కీలక సంస్థల మధ్య కేంద్ర బిందువుగా ఉన్న ఈ పార్క్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఒక ప్రధాన ఆవాసంగా ఉండేది.ముచ్చట్లు, పంచాయతీలు, విద్యార్థుల చర్చలు, ప్రముఖుల సమావేశాలు, అన్నీ ఈ పార్క్ చుట్టూనే జరిగేవి. పక్కనే ఉన్న ఆల్ఫా హోటల్లో చాయ్ తాగుతూ, ఎంత పెద్ద సమస్య అయినా చర్చించి పరిష్కారం దొరికే వేదికగా గాంధీ పార్క్ పేరు గడిరచింది.
వ్యాపారాలకు కేంద్రం :
పుస్తక ప్రదర్శనలు, సాహితీ కార్యక్రమాలు, వక్తల ప్రసంగాలు మాత్రమే కాకుండా, గ్రామాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులకు కూడా ఈ పార్క్ ప్రధాన ఆశ్రయంగా ఉండేది. తక్కువ ఖర్చుతో వ్యాపారాలు, సమావేశాలు నిర్వహించుకునే వీలుండటంతో ఇది ప్రజలతో కళకళలాడేది. అయితే కాలక్రమేణా ఆ కళ మాయ మైంది. నిర్వహణ లేకపోవడంతో పార్క్ అంతా చెత్త చెదారంతో నిండిపోయి, పట్టించుకునే నాథుడు లేక పాడైపోయింది.
ప్రజల కోర్ట్గా గుర్తింపు :
సూర్యాపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తమ సమస్యలను చర్చించుకోవడానికి ఈ పార్క్ను ఆశ్రయించేవారు. పోలీస్ స్టేషన్ లకు వెళ్లకుండానే, కేసుల వరకు వెళ్లకుండా ఉండేందుకు వివిధ కులాల పెద్దమనుషులు ఇక్కడే రాజీప్రయత్నాలుచేసేవారు. అనేక మంది ప్రముఖ నాయకులు తమ రాజకీయ ప్రయాణాన్ని గాంధీ పార్క్ నుంచే ప్రారంభించారని స్థానికులు గుర్తు చేస్తున్నారు.
మళ్లీ తెరవాలన్న డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ కాలంలో గాంధీ పార్క్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతో మరుగున పడిపో యింది. లోపల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాజకీయ విభేదాలు ఏవైనా ఉండొచ్చు గానీ, ప్రజలకు ఉపయోగపడే, ఈ పేదోడి ఆసరా అయిన గాంధీ పార్క్ను పునరుద్ధరించి మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని పట్టణ ప్రజలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
