తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాదులో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)-2025కి హాజరుకావాలంటూ కామారెడ్డి జిల్లా (Kamareddy District) వాసి డాక్టర్ పైడి ఎల్లారెడ్డి(Doctor Paidi Yellareddy)కి ఆహ్వానం అందింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటుచేసింది.
గొప్ప సంకల్పంతో తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, జాతీయ, రాష్ట్రాల విపక్ష నేతలు, మేధావులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. అందువల్ల ఈ బృహత్ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతూ డాక్టర్ పైడి ఎల్లారెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి ఆహ్వాన పత్రిక అందింది. దీంతో.. కామారెడ్డి జిల్లా ప్రజలు, ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా వాసికి ఆహ్వానం అందడం అంటే జిల్లా ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.
