- స్కామ్లపై దర్యాప్తు చేయాలంటు సీబీఐకి ఆదేశాలు జారీ
డిజిటల్ అరెస్ట్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై దర్యాప్తునకు సీబీఐ ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది.జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బగ్చి నేతృత్వం లోని బెంచ్ ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారించింది. విచారణ సందర్భంగా సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దేశంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ అధికారులమంటూ జనాలను భయపెట్టి డబ్బులు దోచేస్తున్నారు.
2025లో డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లు, సెలెబ్రిటీలు సైతం డిజిటల్ అరెస్ట్ స్కామ్ల బారిన పడుతున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై దృష్టి సారించింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టయింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో జనాలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ, ఈడీ అధికారులమంటూ కేటుగాళ్లు 48 లక్షల రూపాయలు కాజేశారు. పోలీసులు నిందితుల నుండి 32 లక్షల రూపాయల నగదు 25 ఏటీఎమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
