డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ(PM Modi)తోపాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center)లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు(Review). ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కింది విషయాలు చెప్పారు.
- సమ్మిట్కు దేశ, విదేశాల వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్ధం చేయాలి
- సదస్సులో పాల్గొనే ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- సదస్సుకు హాజరుకావాలని ఇప్పటికే 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందించారు.
- పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.
- విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
- వక్తలకు సమయం ముందుగానే నిర్దేశించి క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఉండాలి.
- ఒక్కో ఈవెంట్కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలి.
సమ్మిట్ కోసం ఏర్పాటుచేస్తున్న స్టాల్స్ డిజైన్లను అధికారులు వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, పరిశ్రమలు, వైద్య రంగాలకు సంబంధించిన స్టాల్స్ విషయంలో అవసరమైన జాగ్రత్తలను సూచించారు. సమ్మిట్ సందర్బంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజీ(Telangana brand image)ని పెంచేలా ఉండాలని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి అన్ని డిజైన్లు నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.
