హిల్ట్ (HILT) పాలసీయే దీనికి నిదర్శనం
త్వరలో సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూఠీ ఉద్యమం వస్తది
బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో భూబకాసుర రాజ్యం (Bhubakasura Kingdom) ఉందనటానికి హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (HILT) పాలసీ ఒక నిదర్శనమని బీజేఎల్పీ నేత(Bjlp Leader), నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal Mla) ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీహిల్స్ (JubileeHills) ప్యాలెస్లో ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి రోజుకో స్కాంకు తెరలేపుతున్నారని ఆరోపించారు. సీఎంగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టేది పోయి కుంభకోణాలపై శ్రద్ధ ఉందని మండిపడ్డారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ G.O నంబర్ 27 హిల్ట్ (HILT) పాలసీని ఉపసంహరించుకోకపోతే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ రూపొందించి, ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇష్టానుసారంగా రాత్రికి రాత్రి G.Oలు తీసుకొచ్చి రాష్ట్ర సంపదను లూఠీ చేయాలని ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదని అన్నారు. తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఈ హిల్ట్ పాలసీపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో డెమోక్రసీ స్థానంలో క్లెప్టోక్రసి వచ్చిందన్నారు. క్లెప్టోక్రసి అంటే అధికారంలో ఉండి ప్రజా సంపదను లూఠీ చేసే దొంగలని అర్థమన్నారు. ఇలా రాష్ట్రంలో క్లెప్టోక్రసి పాలన నడుస్తుందని దుయ్యబట్టారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో “సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూఠీ” అనే ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. మంత్రులకు ఇందులో వాటా లేకుంటే ఒక్కరైనా స్పందించేవారని, సీఎం రేవంత్ రెడ్డి సహా మొత్తం కేబినెట్ మంత్రులకు ఈ కుంభకోణంలో వాటా ఉందని ఆరోపించారు. గత పాలకులు కిటికీలు తెరిస్తే వీళ్లు దర్వాజా తెరిచినట్లు పరిస్థితి తయారైందని ధ్వజమెత్తారు. BRS పాలనలో వందల ఎకరాలు లూఠీ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వేల ఎకరాల భూమి లూఠీ చేసి తద్వారా లక్షల కోట్లు అవినీతి చేసే యోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబుకు తెలియకుండానే సీఎం రేవంత్ రెడ్డి ప్యాలెస్లో కూర్చొని ఈ పాలసీని డిజైన్ చేసినట్లు కనిపిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చెందిన అనుచరులు ముందుగానే ఈ 22 వాడల్లోకి వెళ్లి 9292 ఎకరాల భూమిని రెక్కీ చేసి ముందే అగ్రిమెంట్లు చేసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తక్షణమే ఈ G.O నంబర్ 27ను రద్దు చేయాలని, లేనియెడల రద్దు చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
