జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలోని మానేరు వాగులో చెక్ డ్యామ్(CheckDam)ను ధ్వంసం చేసిన ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జమ్మికుంట, ఓదెల మండలాల మధ్య మానేరు నదిపై నిర్మించిన రూ.24 కోట్ల చెక్ డ్యామ్ను ఇసుక మాఫియా ఆధ్వర్యంలో ధ్వంసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాలన(Congress Party Government)లో చెరువులను చెరపట్టడం, చెక్ డ్యామ్లను నాశనం చేయటం నిత్యకృత్యంగా మారిందని మండిపడ్డారు.
గతంలో హుస్సేన్ మియా వాగుపై చెక్ డ్యాంను కూడా కూల్చే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. నిర్మల్లో స్వర్ణ వాగుపై ఉన్న చెక్ డ్యాంని నేలమట్టం చేశారని చెప్పారు. ఈ రోజు మానేరు నదిపై బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యామ్ను కూల్చారని అన్నారు. ఓదెల మండల రైతులు, జమ్మికుంట మండల రైతులు వచ్చి ఈ విషయాన్ని మాకు చెబుతున్నారని పేర్కొన్నారు. రాత్రి 8 గంటల వరకు చేపలు పట్టాం. ఉదయం 6 గంటలకు చెక్ డ్యామ్ కనుమరుగైంది. నీళ్లు కిందకు వదిలారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా (Sand Mafia) రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ డ్యామ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

