తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి(Srivenkateshwara swami)వారిని రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా.. పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూవరహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి (Srivari Temple) చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సాదరంగా అహ్వానం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
రంగనాయకుల మండపంలో
ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈవో శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను రాష్ట్రపతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకీ దేవి, భానుప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
