- తిరుపతి గంగమ్మ జాతర..
- వేంకటేశ్వరుడి సోదరి గంగమ్మ..
- మే నెలలో జరిగే పండుగ..
తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగే అత్యంత ప్రసిద్ధ, చారిత్రాత్మక జానపద పండుగ. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో, తిరుమల వేంకటేశ్వరస్వామి సోదరిగా భావించే తాతయ్యగుంట గంగమ్మకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. మే నెలలో జరిగే ఈ ఉత్సవంలో ప్రజలు విచిత్ర వేషధారణలతో, మొక్కులతో గంగమ్మను ఆరాధిస్తారు, జానపదుల సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే గంగమ్మ జాతర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరుపతి గంగమ్మ తిరుమల వేంకటేశ్వరస్వామి సోదరిగా భావించే గ్రామ దేవత. గంగమ్మ తల్లి పిలిస్తే పలికే దైవంగా, తమ పాలిట కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భావించి భక్తులు గంగమ్మ జాతర నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం తమిళ చిత్ర మాసంలో చివరి మంగళవారం రోజు ప్రారంభమయ్యే గంగమ్మ జాతర మే 5, మంగళవారం నుంచి మొదలై మే 12, మంగళవారంతో ముగుస్తుంది. ఈ జాతర ఉత్సవాలు వారంరోజులపాటు ఘనంగా జరుగుతాయి.
తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మను, సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లెలిగా భావించి ఆరాధిస్తారు. స్థానికుల కథనం ప్రకారం పాలెగాడిని సంహరించిన గంగమ్మ మాతంగి రూపంలో పాలెగాడి ఇంటికి వెళ్లి అతని భార్యను ఓదారుస్తుంది. జనన మరణాలు సహజమే అని ధైర్యవచనాలు చెబుతుంది. జాతర చరిత్రను పరిశీలిస్తే ఆనాటి నుంచి గంగమ్మ జాతర జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే గంగమ్మ జాతర అతి ప్రాచీనమైన జాతరగా చరిత్రకెక్కింది.
