- రచనలతో కేంద్ర సాహితి అవార్డు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
- మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..
సమాజానికి సురవరం ప్రతాపరెడ్డి ఆదర్శప్రాయుడు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సాహితీవేత్తలతో కలసి వారి స్వగృహంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. వనపర్తి మొట్టమొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి ఈనెల 28 న 130 వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికను స్థాపించి జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారన్నారు. దళిత దండోరా స్థాపించి అణగారిన వర్గాలకు అండగా నిలిచి .. తన రచనలతో కేంద్ర సాహితీ అవార్డు పొంది సామాజిక రుగ్మతలకు ఎదురొడ్డి నిలిచిన మహానుభావులు సురవరం ప్రతాప్ రెడ్డి అని గుర్తు చేశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి, సాహితీవేత్త, న్యాయవాది సురవరం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్రను ఆవిష్కరించడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదర్శప్రాయునిగా నిలిచిన సురవరం 130 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. సురవరం ప్రతాప్ రెడ్డి పేరు స్థిరస్థాయిగా ఉండాలని వారి పేరిట గ్రంథాలయం, సురవరం పార్కులో వారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు.

సురవరం జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా వారి జీవితంపై పరిశోధన చేసిన గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, సాగునీటి రంగంలో పరిశోధన చేసి సాగునీటి రంగ నిపుణులుగా పనిచేసిన శ్రీధర్ రావు దేశ్ పాండే, సాగునీటి రంగంతో పాటు తెలంగాణ అస్తిత్వవాదంతో పాటు రాజకీయ సామాజిక అంశాలు విశ్లేషణ చేస్తున్న ఉద్యమకారుడు వి ప్రకాష్ పాల్గొంటారని తెలిపారు.
సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సమాజం పట్ల పట్టింపు ఉన్న విజ్ఞులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా మాజీ అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, సాహితీవేత్తలు వీరయ్య, బలరామ్, బైరోజు చంద్రశేఖర్, కిరణ్, తిరుమలేశ్, జోహెబ్ హుస్సేన్, కుమార్, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.
